SRH: పరుగుల జాతరలో 'విన్' రైజర్స్... పోరాడి ఓడిన ఆర్సీబీ

  • ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో నెగ్గిన సన్ రైజర్స్
  • మొదట 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు ఇదే
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసిన ఆర్సీబీ
  • దడపుట్టించిన దినేశ్ కార్తీక్... 35 బంతుల్లో 83 పరుగులు
SRH clinches another victory as RCB fought till last ball

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగులు వెల్లువెత్తిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. 288 పరుగుల లక్ష్యఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేయడం ఆ జట్టు పోరాట పటిమకు అద్దం పట్టింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 102, హెన్రిచ్ క్లాసెన్ 67, అబ్దుల్ సమద్ 37, మార్ క్రమ్ 32, అభిషేక్ శర్మ 34 పరుగులు చేశారు. 

అనంతరం ఛేదనలో... కొండంత లక్ష్యం కళ్లముందున్నా బెంగళూరు జట్టు ఏమాత్రం భయపడలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ జోడీ దుమ్మురేపింది. వీరిద్దరూ 6.2 ఓవర్లలోనే తొలి వికెట్ కు 80 పరుగులు జోడించి సన్ రైజర్స్ గుండెల్లో గుబులు రేపారు. కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు చేయగా, డుప్లెసిస్ 28 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. 

అయితే, మిడిల్ లో విల్ జాక్స్ 7, రజత్ పాటిదార్ 9 పరుగులకే అవుట్ కావడం, సౌరవ్ చౌహాన్ (0) డకౌట్ కావడం ఆ జట్టు ఛేజింగ్ ను ప్రభావితం చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి ఆర్బీబీ స్కోరు 5 వికెట్లకు 122 పరుగులు. 

ఈ దశలో బరిలో దిగిన దినేశ్ కార్తీక్ విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ షాట్లతో హడలెత్తించాడు. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ దినేశ్ కార్తీక్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. దాంతో స్కోరు చూస్తుండగానే 200... ఆపై 240 కూడా దాటిపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ అవుట్ కావడంతో ఆర్బీబీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపు తగ్గిపోయింది. డీకే 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులు బాది 83 పరుగులు చేశాడు. 

మహిపాల్ లోమ్రోర్ 19, అనుజ్ రావత్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 3, మయాంక్ మార్కండే 2, టి.నటరాజన్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. సన్ రైజర్స్ టోర్నీలో ఇప్పటిదాకా 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది. మరోవైపు బెంగళూరు జట్టు 7 మ్యాచ్ లు ఆడి కేవలం 1 విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది.

More Telugu News